స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు..మహిళా సంఘాలకు ఇస్తం : సీఎం రేవంత్ రెడ్డి

స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు..మహిళా సంఘాలకు ఇస్తం : సీఎం రేవంత్ రెడ్డి
  • కుట్టుమిషిన్లు కూడా అందజేస్తం: సీఎం రేవంత్
  • నాగోబా ఆలయంలోని దర్బార్ హాల్​లో మహిళలతో సమావేశం 
  • మహిళా సంఘాలకు రూ.60 కోట్ల బ్యాంకు లింకేజ్​ చెక్​ అందజేత

గుడిహత్నూర్, వెలుగు: మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు స్కూల్​యూనిఫామ్స్​కుట్టే ఆర్డర్లను ఆ సంఘాలకు అప్పగించే ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి అవసరమైన కుట్టుమిషిన్లు కూడా అందజేస్తామని చెప్పారు. శుక్రవారం నాగోబా ఆలయంలోని దర్బార్ హాల్​లో సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మహిళా సంఘాల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనలో ఆడబిడ్డల ఆత్మగౌరవం పదిలంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘మహిళా సంఘాలకు రాజశేఖర్​రెడ్డి హయాంలో పావలా వడ్డీకి, కిరణ్​కుమార్​రెడ్డి హయాంలో జీరో వడ్డీకి రుణాలు ఇచ్చారు. 

మేం ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్​వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం గ్యాస్​సిలిండర్ ధరను రూ.1,200 చేసింది. ఆడబిడ్డలు మళ్లీ కట్టెల కోసం అడవిబాట పట్టే పరిస్థితి వచ్చింది. ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకే రూ.500కే సిలిండర్​అందిస్తాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ఇస్తాం” అని చెప్పారు. ఈ సందర్భంగా 1,413 గ్రూపుల్లోని 12 వేల మంది సభ్యులకు రూ.60 కోట్ల బ్యాంక్​లింకేజీ చెక్కును రేవంత్ అందజేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్​ఆర్గనైజేషన్స్​కు రూ.25 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. కాగా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రేవంత్ పరిశీలించారు. అక్కడి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ కష్టనష్టాలు, విజయగాథలు వివరించారు. ఆత్రం సుశీల అనే మహిళ తన సక్సెస్​ గురించి చెప్పగా.. ఇద్దరు కొడుకులు ఐఏఎస్, ఐపీఎస్​ అయ్యేవిధంగా చదివించాలని రేవంత్ సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని భరోసా ఇచ్చారు.  

అభివృద్ధి పనులు ప్రారంభం..  

మధ్యాహ్నం 2:50 గంటలకు కేస్లాపూర్​నాగోబా ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డికి మెస్రం వంశీయులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. నాగశేషుడి చిత్రపటం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రూ.7 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన నాగోబా ఆలయ గోపురం ప్రారంభించారు. జాతరకు నిధులు కేటాయించారు.