న్యూఢిల్లీ: గ్రో, అప్స్టాక్స్, మోతిలాల్ ఓస్వాల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వంటి స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్ నుంచి డిజిటల్ గోల్డ్ను ఇక అమ్మడానికి వీలులేదు. డిజిటల్ గోల్డ్ను బ్రోకరేజి ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మొద్దని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) తన బ్రోకర్లందరికీ సర్క్యులర్ పంపింది. డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీ ఇప్పుడుప్పుడే విస్తరిస్తోంది. ఈ ఇండస్ట్రీ టర్నోవర్ ఏడాదికి రూ. 5 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. కానీ, డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్లు సెబీ, ఆర్బీఐ రెగ్యులేషన్స్ కిందకు రావడం లేదు. సెబీ వద్ద బ్రోకరేజిగా రిజిస్టర్ అయ్యి, అదే ప్లాట్ఫామ్ నుంచి డిజిటల్ గోల్డ్ను బ్రోకరేజి కంపెనీలు అమ్మకూడదని సెబీ దేశంలోని అన్ని ఎక్స్చేంజిలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్ఎస్ఈ లాంటి ఎక్స్చేంజిలు తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్న బ్రోకరేజి కంపెనీలకు సర్క్యులర్ను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల 10 లోపు తమ డిజిటల్ గోల్డ్ అమ్మకాలను మూసేయాలని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది. డిజిటల్ గోల్డ్ అమ్మకాలు సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) రూల్స్ (ఎస్సీఆర్ఆర్), 1957 వ్యతిరేకంగా ఉన్నాయని సెబీ పేర్కొంటోంది.
ఇప్పుడిప్పడే ఎదుగుతున్న ఇండస్ట్రీ..
డిజిటల్ గోల్డ్ అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఒక ఇన్వెస్టర్ ఏదైనా ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొంటే, రూల్స్ ప్రకారం.. డిజిటల్ గోల్డ్కు సరిపడే ఫిజికల్ గోల్డ్ను గోల్డ్ కంపెనీలు ఒక లాకర్లో స్టోర్ చేస్తాయి. అందుకే డిజిటల్ గోల్డ్ను సేఫ్టీగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆగ్మోంట్ గోల్డ్, ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా, డిజిటల్ గోల్డ్ ఇండియాలు డిజిటల్ గోల్డ్ను కొన్నవారికి ఫిజికల్ గోల్డ్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫెస్టివల్ సీజన్కు ముందు సెబీ నుంచి ఈ ఆదేశాలు రావడం కొంచెం ఈ ఇండస్ట్రీని నిరుత్సాహపరిచేదే. ‘కొన్ని బ్రోకరేజి కంపెనీలు తమ క్లయింట్ల కోసం డిజిటల్ గోల్డ్ కొనడం, అమ్మడం, హోల్డ్ చేయడం చేస్తున్నాయని సెబీ పేర్కొంది. ఇలాంటి పనులు ఎస్సీఆర్ఆర్ రూల్ 8 (3)(ఎఫ్) కు విరుద్ధమని తెలిపింది. డిజిటల్ గోల్డ్ ఏమైనా అమ్ముతుంటే మానుకోండి’ అని ఎన్ఎస్ఈ తన దగ్గర రిజిస్టర్ అయిన బ్రోకరేజి కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. అప్స్టాక్స్, గ్రో, పేటీఎం మనీ వంటి కొత్త తరం బ్రోకరేజి కంపెనీలు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతిలాల్ ఓస్వాల్ వంటి ట్రెడీషనల్ బ్రోకరేజి కంపెనీలు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేందుకు కస్టమర్లకు అవకాశం కలిపిస్తున్నాయి. డిజిటల్ గోల్డ్ సెబీ కిందకు రాదు. సెబీ రిజిస్టర్డ్ లైసెన్స్తో కంపెనీలు పెట్టి, ఈ సంస్థ రెగ్యులేషన్స్ కిందకు రాని ఇండస్ట్రీలో బిజినెస్ చేయడం సెబీకి ఆందోళన కలిగిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. బ్రోకరేజి కంపెనీలు కూడా తమ క్లయింట్ల ఫండ్స్తో డిజిటల్ గోల్డ్ను కొంటారేమోనని భయపడుతోంది.
ఫోన్పే, గూగుల్ పేలు అమ్మొచ్చు..
బ్రోకరేజి కంపెనీలు కాని ఫోన్పే, గూగుల్ పే వంటి పేమెంట్ సర్వీసెస్ కంపెనీలు డిజిటల్ గోల్డ్ను అమ్ముకోవచ్చు, కొనొచ్చు, హోల్డ్ చేయొచ్చు. బ్రోకరేజి కంపెనీలు కూడా సపరేట్గా కంపెనీని ఏర్పాటు చేసి డిజిటల్ గోల్డ్ను అమ్మొచ్చు. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు లేవు. మార్కెట్లో ఉన్న అన్ని ప్రొడక్ట్ల (షేర్లు, బాండ్లు, కరెన్సీ డెరివేటివ్లు వంటివి) కు సెటిల్మెంట్ గ్యారెంటీ ఉంటుంది. అదే డిజిటల్ గోల్డ్ వలన ఇన్వెస్టర్ల డబ్బులు పోగొట్టుకుంటే రెగ్యులేటర్, ఎక్స్చేంజిలు బాధ్యులు కావని ఎనలిస్టులు పేర్కొన్నారు. మరోవైపు కనీసం రూ. 100 కంటే ఎక్కువ పెట్టి డిజిటల్ గోల్డ్ కొన్న యూజర్లు సుమారు 60 లక్షలుగా ఉన్నారని, ఈ ఇండస్ట్రీ పెరుగుతోందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. సెబీ లేదా ఆర్బీఐ ఈ ఇండస్ట్రీ కోసం రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెబుతున్నారు. దీనికి తోడు డిజిటల్ గోల్డ్ కోసం కేటాయించే ఫిజికల్ గోల్డ్ ఎకోసిస్టమ్ చుట్టూ స్టార్టప్లు డెవలప్ అవుతున్నాయని గుర్తు చేస్తున్నారు.