హైదరాబాద్, వెలుగు: గాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 2న గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో ఎస్కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ 'రన్ ఫర్ పీస్' సెకెండ్ ఎడిషన్ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్కు సంబంధించిన జెర్సీ, మెడల్స్ను గురువారం అరణ్య భవన్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి రన్లో పాల్గొనడానికి 2 వేల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారన్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ను నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 గంటలకు 10కే రన్ను ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ రన్కు ఎన్ఎన్ఆర్ డ్రీమ్ స్కేప్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోందని, ఈవెంట్ను సక్సెస్ చేయడానికి 500 మంది వలంటీర్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి. బాల కిషన్
రావు తదితరులు పాల్గొన్నారు.