సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని జీవై రెడ్డి బస్తీలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు భరించలేక డబుల్ బెడ్ రూమ్స్ 8వ అంతస్తు నుంచి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి సౌందర్య తో పాటు కవల పిల్లలు నిత్య, నిదరష్ మృతి చెందారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రి తరలించారు. కూతురి మరణంతో సౌందర్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట జీవై రెడ్డి బస్తీకి చెందిన సౌందర్యకు ఉప్పల్ భరత్ నగర్కు చెందిన గణేష్తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిన్నర క్రితం వీరికి కవల పిల్లలు జన్మించారు. అయితే గణేష్ కొద్దికాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం సౌందర్య బన్సీలాల్ పేటలోని తల్లిగారింటికి వచ్చింది. సోమవారం (జూన్ 19) 8వ అంతస్తు నుంచి ఇద్దరు పడేసిన సౌందర్య..ఆ తర్వాత ఆమె దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లలు, తల్లి చనిపోవడం బాధాకరమన్నారు. చట్ట ప్రకారం నిందితుడిని శిక్షిస్తామన్నారు.