మరో రెండ్రోజుల్లో ఆసియా కప్-2022 ప్రారంభం కానుండగా .. అందరి దృష్టి ఇండియా వర్సెస్ పాక్ పైనే ఉంది. ఆసియా కప్ లో భాగంగా భారత్ ఫస్ట్ మ్యాచ్ ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇదిలావుంటే.. ఈ ఆసియా కప్ భారత్ దేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో వాట్సన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ఆసియాకప్లో టీమిండియా ఛాంపియన్గా నిలుస్తోందని భావిస్తున్నాను. ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా టీమిండియాకు ఉంది. భారత బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పాడు.
ఆసియాకప్లో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీమిండియా ఈ మెగా ఈవెంట్లో 7 సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొనున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభం కాకముందే మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు విజేతను అంచనావేస్తున్నారు.