టూరిజం ప్లేస్‌లు చూపెట్టండి.. ప్రైజ్‌లు పట్టండి

టూరిజం ప్లేస్‌లు చూపెట్టండి.. ప్రైజ్‌లు పట్టండి
  • 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో వినూత్న పోటీ: క్రాంతి
  • పోస్టర్ ఆవిష్కరించిన టూరిజం అధికారులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అద్భుతమైన, ఎవరికీ తెలియని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలోని దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి భారీ నగదు బహుమతులు అందించనున్నట్లు టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల కోసం వారి అభిరుచికి తగ్గట్టు కస్టమ్ టూర్స్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 

గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ఎండీ వల్లూరు క్రాంతి, శాట్ వీసీ, ఎండీ సోని బాల, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్‌తో కలిసి ‘100 వీకెండ్​ వండర్స్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారాంతాల్లో వెళ్లేందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని, ఈ నేపథ్యంలోనే 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి, వాటి వివరాలతో ఒక కాఫీ టేబుల్ బుక్ రూపొందించడమే ఈ పోటీ లక్ష్యమని పేర్కొన్నారు.

10 విభాగాల్లో ఎంట్రీలు..

నేచర్, వైల్డ్ లైఫ్, ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫామ్ స్టేస్, రిసార్ట్స్, స్పిరిచువల్, అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చని క్రాంతి అన్నారు. ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి 3 మంచి ఫొటోలు, 60 సెకన్ల వీడియో, ఆ ప్రదేశానికి రవాణా, బస, బడ్జెట్ వివరాలతో కూడిన 100 పదాల సమాచారాన్ని గూగుల్ ఫామ్ లేదా సోషల్ మీడియాలో తమ ఎకౌంట్లకు ట్యాగ్ చేయవచ్చని తెలిపారు. 

ఉత్తమ ఎంట్రీలకు ఫస్ట్ ప్రైజ్‌గా రూ.50 వేలు, సెకండ్‌ ప్రైజ్‌గా రూ.30 వేలు, థర్డ్‌ ప్రైజ్‌గా రూ.20 వేలు అందిస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్స్‌లో ఉచిత బస కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 5లోపు ఎంట్రీలు పంపించాలని కోరారు. సంక్రాంతికి విజేతలను ప్రకటిస్తామని వెల్లడించారు.