సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది. ఐదో రోజు పంత్, పుజారా, విహారి, అశ్విన్ అద్భుతంగా పోరాడి టీమ్ను ఓటమి నుంచి గట్టెక్కించారు. అయితే పంత్ ఆడుతున్నప్పుడు మ్యాచ్లో భారత్ గెలుపు ఖాయమనేలా కనిపించింది. ఆ టైమ్లో పంత్ బ్యాటింగ్ గార్డ్ మార్క్స్ను ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో హల్చల్ అవుతోంది. స్మిత్ చర్యపై భారత అభిమానులు మండిపడుతున్నారు. స్మిత్ను చీటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై కంగారూ కెప్టెన్ టిమ్ పైన్ స్పందించాడు. స్మిత్ చీటర్ కాదని, అతడే తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు.
‘టెస్టు క్రికెట్లో స్మిత్ ఆడే తీరును గమనిస్తే.. అతడు ప్రతి గేమ్లో ఇలాగే చేస్తాడు. ఆటలో ప్రతి రోజు ఐదు నుంచి ఆరు సార్లు చేస్తాడు. స్మిత్కు బ్యాటింగ్ క్రీజులో నిలబడటం అలవాటు. షాడో బ్యాటింగ్ చేయడం లాంటివి తరచూ చేస్తుంటాడు. స్టాండ్స్ను మార్కింగ్ చేయడం వాటిల్లో ఒకటి అంతే. ఒకవేళ స్మిత్ గార్డ్ మార్క్స్ను చెరిపేసుంటే టీమిండియా దీని గురించి మాట్లాడేది. స్మిత్ అలా చేసి ఉంటే ఇండియా ప్లేయర్లు గుర్తించేవారు. పంత్ గార్డ్ మార్క్స్ను చెరపడానికి స్మిత్ యత్నించాడనడంలో ఎలాంటి నిజం లేదు’ అని పైన్ పేర్కొన్నాడు.