న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్ బెర్తులు సాధించిన ఇండియా మహిళా రెజ్లర్లు తమను సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)ని రిక్వెస్ట్ చేశారు. ఇకపై తమ ప్రతి అడుగు, చేసే ప్రతి చిన్న పని ఒలింపిక్స్లో ఇండియా పతక అవకాశాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ సమయంలో ఒలింపిక్స్కు ప్రిపేర్ అవ్వడానికి తమకు కావాల్సింది మానసిక ప్రశాంతత అని స్టార్ రెజ్లర్ అన్షు మాలిక్ అభిప్రాయపడింది.
ఇండియా నుంచి అన్షు సహా ఐదుగురు మహిళా రెజ్లర్లు క్వాలిఫయింగ్ టోర్నీల్లో సత్తా చాటి ఒలింపిక్ కోటా సాధించారు. వీరికి ట్రయల్స్ నిర్వహించాలని డబ్ల్యూఎఫ్ఐ భావిస్తోంది. ట్రయల్స్ ప్రమాణాలపై నిర్ణయం తీసుకోవడానికి డబ్ల్యూఎఫ్ఐ ఈ నెల 21న సెలక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే, ఒలింపిక్స్కు ముంగిట ట్రయల్స్లో పాల్గొంటే శారీరక, మానసిక ఒత్తిడికి గురవడమే కాకుండా తమ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ను దెబ్బతీస్తుందని అన్షు, ఇతర రెజ్లర్లు అభిప్రాయపడ్డారు.
