South Africa Cricket Team: సౌతాఫ్రికా చేరుకున్న బవుమా సేన.. వరల్డ్ ఛాంపియన్స్‌కు వేలాది మంది గ్రాండ్ వెల్కమ్

South Africa Cricket Team: సౌతాఫ్రికా చేరుకున్న బవుమా సేన.. వరల్డ్ ఛాంపియన్స్‌కు వేలాది మంది గ్రాండ్ వెల్కమ్

ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023-25)ను సౌతాఫ్రికా గెలుచుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఫైనల్లో మట్టికరిపించి 27 ఏళ్ళ తర్వాత తొలిసారి ఐసీసీ టైటిల్ ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన  ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ మార్కరం (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సూపర్ సెంచరీతో సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. బవుమా రెండు ఇన్నింగ్స్ ల్లో కీలక పరుగులు చేయగా.. రబడా 9 వికెట్లు పడగొట్టి సఫారీ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.   

టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకొన్న తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ సొంత దేశంలో అడుగుపెట్టింది. బుధవారం (జూన్ 18)  జోహన్నెస్‌బర్గ్ ప్రధాన విమానాశ్రయానికి చేరుకున్నారు. వేలాది మంది సౌతాఫ్రికాక్రికెట్ అభిమానులు ఎయిర్ పోర్ట్ కు చేరుకొని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ముందుగా కెప్టెన్ టెంబా బావుమా టెస్ట్ గదను పైకి ఎత్తుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత జట్టు మొత్తం ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.   

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ కు చేరుకున్న తర్వాత ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఐసీసీ టోర్నీలో అద్భుత రికార్డ్ ఉన్న కంగారూల జట్టును ఓడించడం అసాధ్యమని భావించారు. అయితే సమిష్టిగా ఆడితే ఎంత పెద్ద జట్టునైనా ఓడించవచ్చని సౌతాఫ్రికా నిరూపించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 విజేతగా నిలిచి 27 ఏళ్లుగా తమ దగ్గర లేని ఐసీసీ టైటిల్ కరువును తీర్చుకుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో   సౌతాఫ్రికా 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ కాగా.. 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలిచింది.   

ఇక మరోవైపు వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురైంది. రెండు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా బ్యాటింగ్ చేయడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. అంతకముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ప్రస్తుతం ముగిసిన మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ను ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.