వికారాబాద్, వెలుగు : సద్గురు సేవాలాల్ మహారాజ్ సిద్ధాంతాలను ఆశయాలను అనుసరిస్తూ ప్రజలు ముందుకు సాగాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. మహా పురుషుల బాటలో నడిచినట్లైతే తమ జీవన విధానంలోనూ మార్పులు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని, ప్రజల సహకారంతో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యువత చెడు అలవాట్లకు లోనవకుండా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ముందుగా స్పీకర్ తో పాటు కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల , మున్సిపల్ ఫోర్ లీడర్ సుధాకర్ రెడ్డి భోగ్ బండార్ పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయ్ కుమారి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోటాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సద్గురు సేవాలాల్ మహారాజ్ సంఘం కమిటీ సభ్యులు కిషన్ నాయక్, పాండు నాయక్, పరుశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.