- ఇది రాజ్యాంగాన్ని కాల రాయడమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్, వెలుగు: రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలనూ దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డినేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఇది సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సేవ్ ది కానిస్టిట్యూషన్అసలు నినాదం.. స్పీకర్ ఇచ్చిన తీర్పుతో తేలిపోయిందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన ఫిరాయింపు చట్టం నియమాలను స్పీకర్ పక్కనపెట్టారని విమర్శించారు.
అధికారపార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ.. తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. సేవ్ ది కానిస్టిట్యూషన్ నినాదం కేవలం మాటలకే పరిమితమైందన్నారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: వినోద్ కుమార్
స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు స్వయంగా ఎమ్మెల్యేలే చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ, స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని, పదో షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
