- ఫేక్ ఐటీ ఆఫీసర్ల పేరుతో రాబరీ కేసును ఛేదించిన పోలీసులు
- అయిదుగురు అరెస్టు.. పరారీలో మరో నలుగురు
- వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్లో ఫేక్ ఐటీ ఆఫీసర్స్ రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. 9 మంది సభ్యుల ముఠాలో ఐదుగురిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.2 కోట్ల విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఐటీ ఆఫీసర్స్ అని చెప్పి నానక్రామ్గూడ జయభేరి ఆరెంజ్ కౌంటీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో 1,340 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, రూ.2 లక్షల క్యాష్ను నిందితులు దోచుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. వ్యాపారి దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్ దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.
ఆఫీస్ బాయ్తో కలిసి చోరీ ప్లాన్
రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట సుబ్రమణ్యం నానక్రామ్గూడ జయభేరి ఆరెంజ్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. బంజారాహిల్స్ లుంబినీ అమృత ఛాంబర్స్ బిల్డింగ్లో భువన తేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆయన ఆఫీస్లో ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన మరుపుడి జశ్వంత్(21) ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. అదే బిల్డింగ్లో నర్సాపురం శ్రీహరిపేటకు చెందిన పున్నని మోహన్(24) రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈస్ట్ గోదావరి జిల్లా మలికిపురం కేసన్పల్లికి చెందిన అరవింద్(27), సోమని సందీప్(22) మాదాపూర్లో కేఫ్ ప్రారంభించారు. ఈ క్రమంలో సుబ్రమణ్యం ఆఫీస్లో పనిచేసే జశ్వంత్తో పరిచయం ఏర్పడింది. అక్టోబర్లో అందరూ కలిసి అరవింద్ రూమ్లో పార్టీ చేసుకున్నారు. సుబ్రమణ్యం బిజినెస్, మనీ ట్రాన్సాక్షన్స్ గురించి పార్టీలో డిస్కస్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో సంపన్నులను దోచుకునే ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమా చూసి, సినీ ఫక్కీలో స్కెచ్ వేశారు. ఏపీకే చెందిన నేలపుడి మురళీ శ్రీధర్(27), పసగాడ వెంకట్రావ్ (28), సాయిబాబా, శ్రీనివాస్, చలకపాటి శ్రీనివాస్లకు ప్లాన్ వివరించారు. ఐటీ ఆఫీసర్స్గా ఫేక్ ఐడీ కార్డ్లు క్రియేట్ చేసుకొని మారుతి ఎర్టిగా కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి శ్రీధర్ సహా మరో నలుగురు ఆదివారం రాత్రి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చారు.
సమాచారం ఇచ్చిన ఆఫీస్ బాయ్
అరవింద్తో కలిసి సుబ్రమణ్యం ఇంటి చుట్టూ సోమవారం రెక్కీ వేశారు. ఇంటి పరిసరాలు, లాకర్ వివరాలను చెప్పిన జశ్వంత్.. సుబ్రమణ్యం బయటకు వెళ్లగానే అరవింద్ గ్యాంగ్కి సమాచారం ఇచ్చాడు. ఏపీ నుంచి వచ్చిన నలుగురు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుబ్రమణ్యం ఇంటికి ఐటీ ఆఫీసర్ల మాదిరిగా నీట్గా డ్రెస్సులు వేసుకుని వెళ్లారు. డ్రైవర్ స్వామి నాయుడు, సుబ్రమణ్యం భార్య భాగ్యలక్ష్మితో ఐటీ అధికారులమని నమ్మించారు. ఫేక్ ఐడీ కార్డులు చూపించారు. ఇల్లంతా సెర్చ్ చేశారు. భాగ్యలక్ష్మి వద్ద లాకర్ కీ తీసుకుని అందులో ఉన్న బంగారు నగలు, రూ.2 లక్షలు సీజ్ చేస్తున్నామని చెప్పారు. వైట్ పేపర్స్పై సంతకాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ఉపయోగించిన కారును ట్రేస్ చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు.. ఆర్సీపురంలో నిందితులను అరెస్ట్ చేశారు.