రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 20 ప్రత్యేక రైళ్లు

రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో 20 ప్రత్యేక రైళ్లు

ఈస్టుకోస్టు రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యం కోసం రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో మరో 20 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. దేశంలోని ప్రధాన నగరాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని వివిధ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్ లో జీరో లేదా 8 నంబరుతో ప్రత్యేక రైలు నంబర్లు ప్రారంభమవుతాయని తెలిపారు అధికారులు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ఐదు లక్షల మంది ప్రయాణికులకు అవసరమైన బెర్తులు లభిస్తాయి.

ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరు, హౌరా, చెన్నై,  అలహాబాద్, పాట్నా, భాగల్పూర్ నగరాలకు ఎక్కువ రద్దీ ఉంటుందని, ఈ రూట్లపై దృష్టిసారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతోపాటు సాధారణ రైళ్లలోనూ బోగీల సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్నారు. పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వస్తే ప్రత్యేక రైళ్లలో టికెట్లు తీసుకోవచ్చని సూచించారు.