ఎస్టీపీల పనుల్లో వేగం పెంచాలి : వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్

ఎస్టీపీల పనుల్లో వేగం పెంచాలి : వాటర్ బోర్డు ఎండీ దాన కిశోర్

హైదరాబాద్, వెలుగు: సిటీలో కొనసాగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు.  నల్లచెరువు, ఫతేనగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎస్టీపీలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దాన కిశోర్ మాట్లాడుతూ.. నిర్మాణంలో తుది దశకి చేరుకున్న ఎస్టీపీలను తొందరగా పూర్తి చేయాలన్నారు. పనులకు అనుగుణంగా కార్మికులు, సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించారు. అవసరమైతే రెండు షిఫ్టుల్లో పని చేయాలని, రాత్రివేళల్లో పనులు చేయడానికి వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

సివిల్ పనులు పూర్తయిన వాటిల్లో మెషీన్ల బిగింపు పనులు మొదలు పెట్టాలన్నారు. విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్ ఫార్మర్, కేబులింగ్ పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, బ్యూటిఫికేషన్ కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలని వివరించారు. పని ప్రదేశాల్లో కచ్చితమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దానకిశోర్ వెంట వాటర్ బోర్డు ఈడీ  సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు సుజాత, రఘు ఉన్నారు.