ఈడెన్ గార్డెన్స్‌లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న స్టాఫ్ వర్కర్ కుమారుడు

ఈడెన్ గార్డెన్స్‌లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న స్టాఫ్ వర్కర్ కుమారుడు

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున స్టేడియం సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి తండ్రి, మామ స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తుండగా, అతనికి ఉద్యోగం దొరక్కపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సోమవారం ఉదయాన్నే విధులకు హాజరైన సిబ్బందికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. స్టేడియంలోని కే బ్లాక్‌లో మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. మృతుడు గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ గణేష్ చంద్ర బారిక్ కుమారుడు ధనంజయ్ బారిక్(21)గా గుర్తించారు. అతడు ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్లుగా మైదాన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కావడం గమనార్హం. 

 ఉద్యోగం దొరక్కపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా స్టేడియంలోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ సమయంలో అతడు స్టేడియంలోకి ఎంటరయ్యాడు. అతని వెంట మరెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు.