
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, కుక్కలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.జిల్లాలోని ధరూర్ మండలంలోని దోర్నాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వ్యాధి పక్కనే ఉన్న మరో మండలానికి పాకింది. ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
పెద్ద ఎత్తున పక్షులు మరణించడంతో ఆ వ్యాధికి కారణమేంటో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా మరణిస్తున్నాయా? లేదా మరేదైనా కారణమా? అనేది అంతు బట్టడం లేదంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించనున్నారు.