బర్త్ డే పార్టీ డబ్బుల విషయంలో గొడవ.. విద్యార్థి మృతి

బర్త్ డే పార్టీ డబ్బుల విషయంలో గొడవ.. విద్యార్థి మృతి

బర్త్ డే పార్టీకి డబ్బుల విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. గొడవలో ఆ ఇద్దరు రెండో అంతస్తుపై నుంచి కిందపడడంతో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ లోని జలంధర్ లో డీఏవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (DAV Institute of Engineering and Technology) హాస్టల్ భవనంలో పుట్టిన రోజు పార్టీ ఏర్పాటులో డబ్బులు ఇవ్వాలని ఓ విద్యార్థుడు మరో విద్యార్థుడిని కోరాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, ఇది గొడవకు దారి తీసిందన్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.

వీరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారని కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా. సంజీవ్ నావల్ ఓ జాతీయ సంస్థ ఛానెల్ కు వెల్లడించారు. రెండో అంతస్తు నుంచి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయన్నారు. వీరిని ఆసుపత్రికి తరలించగా.. ఓ విద్యార్థి చనిపోయాడన్నారు. మరొకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ Jaskiratjit Taneja తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇద్దరు విద్యార్థులు బీఎస్సీ కోర్సు చదువుతున్నారని సమాచారం.