- 20 ఏండ్ల భూ వివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు తీర్పు
- సాలార్ జంగ్ వారసుల వాదనను తోసిపుచ్చిన బెంచ్
- ఫారెస్ట్ ఆఫీసర్ల అలసత్వంతోనే ఈ దుస్థితి అని అసంతృప్తి
- ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే అని స్పష్టం
- 2 నెలల్లో రిజర్వ్ ఫారెస్ట్గా నోటిఫై చేయాలని సీఎస్ కు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీ శాఖదే అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ భూమి వ్యవహారంలో సాలార్జంగ్ వారసులు చేస్తున్న వాదనను తోసిపుచ్చింది.
అలాగే గతంలో ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. ఈ మేరకు గురువారం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్ వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం మొత్తం 47 పేజీల తీర్పును వెలువరించింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం.201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీ ఖాన్ (సాలార్జంగ్-3 వారసులు) తదితరులు ఆ భూములు తమవే అని పేర్కొంటున్నారు.
దీనిపై తెలంగాణ సర్కారు 2023 ఏప్రిల్ 20న సుప్రీంలో సివిల్ అప్పీల్కు వెళ్లింది. అప్పటి నుంచీ ఈ కేసు విచా రణ కొనసాగుతోంది. 1832 నాటి కొను గోలు పత్రాల ఆధారంగా ఇది తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని ప్రతివాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2014లో ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీసర్ వారి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు.
దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. వాదనలు విన్న ధర్మాసనం... జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమయ్యాయని తీర్పును వెలువరించింది.
ఆ పత్రాలు నమ్మేలా లేవు
1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగం అయ్యాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని గుర్తుచేసింది. అప్పటి నుంచి అది అటవీ శాఖ ఆధీనంలోనే ఉందని తేల్చి చెప్పింది. సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని ధర్మాసనం తన తీర్పులో అభిప్రాయపడింది.
జిరాక్సు పత్రాలను ఆధారంగా చేసుకుని, వాస్తవ రికార్డులను సరిగా పరిశీలించకుండానే కింది కోర్టులు తీర్పులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే, ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి అటవీ శాఖదే అని తేల్చినందున ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆఫీసర్ల తీరుపై అసహనం...
సుదీర్ఘ కాలంగా ఆ భూమిపై వివాదాలు కొనసా గడం, అధికారుల అలసత్వంపై బెంచ్ అసహ నం వ్యక్తం చేసింది. ఈ కేసులో సమయానికి తగినట్టు అభ్యంతరాలను తమ వాదనలో తెల పడంలో ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించార ని పేర్కొంది. అలాగే, యాజమాన్య హక్కుల వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని గుర్తుచేసింది.
సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కు ఆ అధికారం లేదని తేల్చి చెప్పింది. ఫారెస్ట్ సెటి ల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభు త్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఆ 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్ ఫారెస్ట్’ గా ప్రకటిస్తూ తెలంగాణ అటవీ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర సీఎస్ ను ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది.
