దొంగల దాడిలో రైనా బంధువు మృతి.. నలుగురికి గాయాలు

దొంగల దాడిలో రైనా బంధువు మృతి.. నలుగురికి గాయాలు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెఫ్టాండర్ సురేష్ రైనాకు బంధువుల్లో ఓ 58 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. దొంగల దాడిలో సదరు వ్యక్తి కుటుంబంలోని మరో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు శనివారం తెలిపారు. చనిపోయిన వ్యక్తి పేరు అశోక్‌ కుమార్, ఆయన గవర్నమెంట్ కాంట్రాక్టర్‌‌ అని తెలుస్తోంది. పంజాబ్‌, పఠాన్‌కోట్‌ జిల్లాలోని థరియాల్‌ గ్రామంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ‘కాలే కచ్ఛేవాలా’ అనే గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు నుంచి నలుగురు దుండగులు థరియాల్‌లోని అశోక్‌ కుమార్ ఇంటిపై దొంగతనానికి వచ్చారు.

దుండగులు దొంగతనానికి వచ్చిన సమయంలో అశోక్ కుటుంబీకులు ఇంటి టెర్రస్‌పై పడుకున్నారు. దుండగుల దాడిలో అశోక్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఆయన మృతి చెందారు. మిగిలిన కుటుంబీకులకు కూడా గాయాలయ్యాయి. అశోక్ మృతి చెందిన విషయాన్ని పఠాన్‌కోట్ సీనియర్ ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా ధ్రువపరిచారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. అశోక్ ఇంట్లో నుంచి దుండగులు కొంత డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లారని చెప్పారు.