
ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆదివారం (జూన్ 1) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హార్దిక్ సేన 203 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు విఫలమవడంతో ముంబైకి నిరాశ తప్పలేదు. ముంబై జట్టుగా ఓడిపోయినా ఆ జట్టు ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టోర్నీ మొత్తం ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో అసాధారణ నిలకడతో అదరగొడుతున్నాడు. క్వాలిఫయర్ 2 లో 44 పరుగులు చేసి ఆల్ టైం ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2025 లో సూర్య ఆడిన 16 ఇన్నింగ్స్ ల్లో 25 కంటే ఎక్కువ పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 16 మ్యాచ్ల్లో 65.18 సగటుతో 717 పరుగులు చేశాడు. 167.91 స్ట్రైక్ రేట్ ఉండగా.. అతని ఖాతాలో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన నిలకడతో ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో ఓపెనర్ గా కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ 2016 ఐపీఎల్ సీజన్ లో 687 పరుగులు చేసి టాప్ లో ఉన్న రికార్డ్ ను సూర్య అధిగమించాడు. 2018ఐపీఎల్ లో రిషబ్ పంత్ 684 చేసి తృటిలో ఈ రికార్డ్ మిస్ చేసుకున్నాడు.
ఐపీఎల్ సీజన్లో నాన్-ఓపెనర్లు చేసిన అత్యధిక పరుగులు:
717 - సూర్యకుమార్ యాదవ్(2025)
687 - ఎబి డివిలియర్స్ (2016)
684 - రిషబ్ పంత్ (2018)
622 - కేన్ విలియమ్సన్ (2018)
605 - సూర్యకుమార్ యాదవ్(2023)
578 - విరాట్ కోహ్లీ (2013)
ఇక ముంబై తరపున మరికొన్ని రికార్డ్స్ సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్లో ముంబై తరఫున 700 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక సీజన్ లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 717 పరుగులతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్య ఈ సీజన్ ముగించాడు. ఓవరాల్ గా సాయి సుదర్శన్ ఈ సీజన్ లో 759 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.