అనుమానంతో భార్యను పొడిచి చంపేశాడు

అనుమానంతో భార్యను పొడిచి చంపేశాడు

 నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: ఇతరులతో  సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. మహారాష్ట్రలోని కిన్వాత్ గ్రామానికి చెందిన ఫర్హానా ఖురేషి(25) భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా నిర్నా గ్రామానికి చెందిన మోసిన్ ఖాన్ (31)తో రెండేళ్ల క్రితం ఫర్హానాకు పరిచయం ఏర్పడింది. ఐదునెలల క్రితం వీరిద్దరూ సిటీకి వచ్చి పెండ్లి చేసుకున్నారు. మోసిన్, ఫర్హానా గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో రూమ్ రెంట్ కి తీసుకుని ఉంటున్నారు. మోసిన్ ఖాన్ కిరోసిన్ డీలర్ గా పనిచేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఫర్హానా వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటోందని మోసిన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తను మార్చుకోవాలంటూ మోసిన్ ఆమెను హెచ్చరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి 11 గంటలకు మోసిన్, ఫర్హానా మధ్య మరోసారి గొడవ జరిగింది. కోపంతో మోసిన  భార్య ఫర్హానాను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడిక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. మోసిన్ ను అరెస్ట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.