అబుదాబి: పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది. ఆ అద్భుతం అఫ్గానిస్తాన్ టీమ్ చేయాలని, తమను సెమీఫైనల్కు చేర్చాలని చూస్తోంది. సూపర్12, గ్రూప్2లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో అఫ్గాన్ ఫోటీ పడనుంది. గ్రూప్2 నుంచి పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో మరో బెర్త్ తేలనుంది. ఈ పోరులో కివీస్ను అఫ్గాన్ ఓడిస్తే ఇండియా సెమీస్ దారి క్లియర్ అవుతుంది. సోమవారం జరిగే లాస్ట్ మ్యాచ్లో నమీబియాపై భారీ విజయం సాధిస్తే కోహ్లీసేన నాకౌట్ చేరుకుంటుంది. కాబట్టి.. కివీస్పై అఫ్గాన్ నెగ్గాలని టీమ్తోపాటు కోట్లాది మంది ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. అయితే, అది ఆశించినంత సులభం కాదు. బ్లాక్క్యాప్స్ టీమ్ చాలా స్ట్రాంగ్ టీమ్. పాక్ చేతిలో ఓటమి తర్వాత ఇండియాను చిత్తు చేసింది. అదే జోరుతో స్కాట్లాండ్, నమీబియాపై గెలిచి ఆరు పాయింట్లతో టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. నాలుగు మ్యాచ్ల్లో రెండు విక్టరీలతో అఫ్గాన్ నాలుగో ప్లేస్లో ఉంది. ఆట, అనుభవం పరంగా తమకంటే చాలా ముందున్న కివీస్ను ఓడించడం అంత ఈజీ కాదని అఫ్గాన్కు కూడా తెలుసు. అయితే, స్పిన్ బౌలింగ్లో కివీస్ బ్యాటర్లు వీక్. జోరుమీదున్న అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చెలరేగితే అఫ్గాన్ నుంచి అద్భుతం ఆశించొచ్చు. కాగా, ఇప్పటికే సెమీస్ చేరిన పాకిస్తాన్ ఆదివారం రాత్రి జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో స్కాట్లాండ్తో పోటీపడనుంది. ఇందులోనూ గెలిచి నాటౌట్గా నాకౌట్ చేరాలని పాక్ ఆశిస్తోంది.