హైదరాబాద్,వెలుగు : రాచకొండ కొత్త సీపీగా తరుణ్ జోషి బుధవారం బాధ్యతలు చేపట్టారు. నేరేడ్మెట్లోని కమిషనరేట్లో చార్జ్ తీసుకుని డీసీపీలు, ఏసీపీలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహిళా సంరక్షణకు కట్టుదిట్టమైనచర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్ లో అదనపు కమిషనర్ గా పని చేసిన అనుభవంతో అన్ని ప్రాంతాల మీద పట్టు ఉందని చెప్పారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.