5,111 అంగన్ వాడీ, ఆయా పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

5,111 అంగన్ వాడీ, ఆయా పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్  భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు ఇది అదనం. వీటిని కలుపుకుంటే  రాష్ట్రంలోని మొత్తం పింఛనుదారుల సంఖ్య 46 లక్షలకు పెరుగుతుంది.  ఇవాళ మధ్యాహ్నం బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీసులో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలివీ..  

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా..

  • స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. 
  • స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30కు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయించారు. 
  • స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21న తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేశారు.
  • ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యాలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేశారు. 

కోఠి ఈఎన్టీ..

  • కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10  స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేశారు. 
  • కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మించనున్నారు.  
  • సరోజినీ దేవి కంటి దవాఖానలోనూ నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.  
  • కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. 
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 

స్థల కేటాయింపులు.. 

  • జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని  కేబినెట్ ఆదేశించింది. 
  • వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 
  • తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 
  • షాబాద్ లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలను కేటాయించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ 

 ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు  మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమని సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతోందన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం, పరిమితుల్లోనూ కోతలు విధించారని వివరించారు. ఎప్.ఆర్.బి.ఎంలో కోతలు విధించకపోయి ఉంటే రాష్ట్రం ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ సీఎస్ఎస్ ద్వారా గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి 47,312 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ వివరించింది.  గత నాలుగు సంవత్సరాల్లో రైతుబంధు పథకం కింద రైతులకు రూ.58,024  కోట్ల పంట పెట్టుబడి సాయం అందించామని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ.5200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయి. ‘‘ కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతోంది’’ అని  సీఎం కేసీఆర్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.

దేశ ఆదాయానికి 5 శాతం కంట్రిబ్యూట్..

దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేసిందని అధికారులు కేబినెట్ కు వివరించారు.  రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-, 2015లో రాష్ట్రం ఆదాయం  రూ.62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరిగిందన్నారు.  అంటే.. ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

ఐటీలో 1.55 లక్షల కొత్త ఉద్యోగాలు 

ఐటీ రంగంలో గత సంవత్సరం తెలంగాణ  రాష్ట్రం 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించారని ఐటీ అధికారులు వివరించారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనరుల లభ్యత వల్ల ఐటీ రంగం లో అభివృద్ధి సాధ్యమైందన్నారు.