- సిటీలో రోజుకు 2 కోట్లు అవసరం
- అందుబాటులో ఉన్నవి 50 లక్షలే
- ఆ ఎఫెక్ట్తో హోల్సేల్లో డజన్గుడ్లు రూ.90
- రిటైల్లో ఒక్కోగుడ్డు రూ.8 పైనే
హైదరాబాద్సిటీ, వెలుగు: సండే హో యా మండే.. రోజ్ఖావో అండే... అంటూ ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్నా ఇప్పుడు కోడిగుడ్డు అందరూ రోజూ తినలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లలో ఎక్కువ శాతం పక్క రాష్ట్రాలకు తరలిపోతుండడంతో ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది చలికాలం ప్రారంభం కాగానే, నవంబరు నుంచి మూడు నెలల పాటు కోడిగుడ్డు ధర కాస్త పెరుగుతుంది. అయితే, ఈసారి సీన్మారింది. గత సంవత్సరం ఒక్కో గుడ్డు ధర రూ.6 ఉండగా ఈసారి మాత్రం రూ.8 దాటింది.. దీంతో సామాన్యులే కాదు దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి వర్గాలు రోజూ కోడిగుడ్డు తినడానికి ఆలోచిస్తున్నాయి.
పక్క రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో...
ఢిల్లీ, ముంబయి, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఏపీతో పాటు నార్త్ఈస్ట్రన్ స్టేట్స్లో ఈసారి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో అక్కడ అధిక డిమాండ్ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రాలన్నీ తెలంగాణవైపు చూశాయి. ఇక్కడి కంటే అక్కడ ఒక్కో గుడ్డుకు 25 పైసలు ఎక్కువే చెల్లిస్తుండడంతో మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం గుడ్లలో 60 నుంచి70 శాతం గుడ్లు అటే ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ముంబయికే రోజుకు 60 నుంచి 70లక్షలు, విదర్భకు 30 లక్షలు, యూపీకి 80లక్షలు ఎగుమతి చేస్తున్నారు. అయినా, ఇప్పుడు అక్కడ ఒక్కో గుడ్డు ధర రూ.10 వరకు ఉందంటున్నారు.
నగరంలో అ‘ధర’హో !
హైదరాబాద్నగరానికి రోజుకు 2 కోట్ల వరకు కోడిగుడ్లు డిమాండ్ఉండగా 50 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. దీంతో భారీగా డిమాండ్ పెరిగి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నగరంలోని హోల్సేల్మార్కెట్లో ప్రస్తుతం డజన్గుడ్ల ధర రూ.90 ఉండగా, రిటైల్మార్కెట్లో రూ. 8 నుంచి రూ.8.50 వరకు అమ్ముతున్నారు. తెలంగాణలోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్ వాడీ కేంద్రాలు, సోషల్వెల్ఫేర్హాస్టళ్లకూ కోడిగుడ్ల సరఫరా ఉంటుంది. వీటికి యథావిధిగా సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంతో పాటు నగరంలో జనాలకు గుడ్ల సరఫరా తగ్గి డిమాండ్పెరిగి రేట్లు పెరుగుతున్నాయి.
దేశంలోనే నంబర్ వన్ ..
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. ఈ సంవత్సరం కోడిపిల్లల ఉత్పత్తి కొంత తగ్గినా గుడ్ల ఉత్పత్తిలో మాత్రం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరో 30 శాతం ఉత్పత్తి పెరిగిందని పౌల్ర్టీ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో రోజుకు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, ఒక్క హైదరాబాద్నగరంలోనే రోజుకు 2 కోట్ల వరకు కోడిగుడ్లను వినియోగిస్తుంటారని ఎగ్ కో ఆర్డినేషన్కమిటీ (నెక్) అసిస్టెంట్జీఎం (బిజినెస్) సంజీవ్చింతావర్తెలిపారు.
వేసవి వరకు తగ్గుతాయ్
ప్రతి సంవత్సరం నవంబర్నుంచి జనవరి వరకూ కోడిగుడ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఈసారి రాష్ట్రంలో కొరత కారణంగా ధరలు పెరిగాయి. ఈ ధరలు వేసవి నాటికి తగ్గుతాయి. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న నార్త్ఈస్ట్రన్ తో పాటు నార్త్రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఒక్కో కోడిగుడ్డు రూ. 9 నుంచి 10 ఉంది.
– సంజీవ్ చింతావర్,
నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అసిస్టెంట్ జీఎం
