అధికారికంగా శ్రీపాదరావు జయంతి

అధికారికంగా శ్రీపాదరావు జయంతి

హైదరాబాద్, వెలుగు:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని స్టేట్ ఫంక్షన్ గా వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్ గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎన్ఎంబీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ఆయనను హత్య చేశారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావును బుచ్చి పంతులు అని పిలిచేవారు. ఆయన మరణానంతరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.