హైదరాబాద్, వెలుగు:
సమ్మె టైంలో సంస్థలో జరిగిన లావాదేవీలపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఆ టైంలో చేసిన ట్రాన్సాక్షన్లను లెక్కగట్టనుంది. ఇందుకోసం ఆర్టీసీ ఆడిట్ అధికారులు రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది. సోమవారం నుంచి సికింద్రాబాద్ రీజియన్లో మొదటగా ఆడిట్ జరగనున్నట్లు సమాచారం. సరిపడ సిబ్బంది లేకపోవడంతో సంస్థకు ఆడిట్ సవాలుగా మారనుంది.
55 రోజుల లావాదేవీలపై
సమ్మె జరిగిన 55 రోజుల్లో ఆర్థిక, నిర్వహణపరమైన లావాదేవీలను సంస్థ ఆడిట్ చేయనుంది. ఎంత ఆదాయం వచ్చింది, ఖర్చెంతయింది, రోజుకు ఎన్ని బస్సులు తిరిగాయి, బ్యాంకు రెమిట్టె్న్సులు, బ్యాంకు స్టేట్మెంట్లు, రిజిస్టర్ల మెయింటెనెన్సు, సెక్యూరిటీ దగ్గరున్న రికార్డులను ఆడిట్ టీం పరిశీలించనుంది. ఎంత డీజిల్ ఖర్చయింది, విభాగాల ఖర్చు, టెంపరరీ ఉద్యోగుల డబ్బులు.. అన్నీ లెక్కలోకి తీసుకోనుంది. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి సూపర్వైజర్ స్థాయి అధికారులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం సిబ్బంది లేకుండా సమ్మె జరగడమూ ఇదే తొలిసారి. మేనేజర్లు, సెక్యూరిటీ వాళ్లే డ్యూటీలో ఉన్నారు.
అక్రమాల ఆరోపణలు?
సమ్మె కాలంలో ఆర్టీసీని అధికారులు దోచుకున్నారని ఆర్టీసీ జేఏసీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ టైంలో డిపో మేనేజర్లు అకౌంట్లు సరిగా మెయింటెయిన్ చేయలేదని ఆరోపణలున్నాయి. సర్కారు ఆదేశాలతో బస్సులు నడపడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారని, జమా ఖర్చుల వివరాలు రాయలేదని తెలుస్తోంది. సమ్మె మొదట్లో తాత్కాలిక సిబ్బందికి టిమ్స్ మెషీన్లు ఇవ్వలేదు. దీంతో ఎంత ఆదాయం వచ్చిందో సరిగా చెప్పడం కష్టమని అంటున్నారు. 15 రోజుల తర్వాత టిమ్స్ మిషన్లు ఇచ్చాక లెక్క తెలిసింది. సిబ్బంది లేకపోవడంతో డబ్బుల లెక్కలను ఆన్లైన్లో ఎంటర్ చేయకుండా ప్రతీదీ మాన్యువల్గా రాశారు. ఈ మధ్య కాలంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. టికెట్ కాకుండా ఇతరత్రా ఆదాయం ఎంత వచ్చిందో కూడా తెలుసుకోనున్నారు.