ప్రభుత్వ నిధులతోనే బోనాల నిర్వహణ

ప్రభుత్వ నిధులతోనే బోనాల నిర్వహణ

హైదరాబాద్: బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బోనాల నిర్వహణపై మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఈ ఏడాది బోనాల జాతరలో ఏనుగు ఊరేగింపు ఉంటుందని తలసాని తెలిపారు. ప్రభుత్వమే బోనాలకు నిధులను కేటాయించి నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 11న గోల్కోండలో ప్రభుత్వం అన్ని లాంఛనాలతో పండుగ వేడుకలను ఆరంభిస్తుందని పేర్కొన్నారు. జూలై 25న ఉజ్జయిని బోనాలు, ఆగస్ట్ 1న ఓల్డ్ సిటీ బోనాలు షురూ అవుతాయన్నారు. బోనాలకు శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా డీజీపీ, మూడు కమిషనరేట్ల పరిధిలోని సీపీలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సాంస్కృతిక, విద్యుత్ శాఖలతోపాటు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంతో బోనాల వేడుకలు జరుగుతాయని వివరించారు.