స్థానిక పోరులో ఎన్నికల సంఘం సక్సెస్

 స్థానిక పోరులో ఎన్నికల సంఘం సక్సెస్
  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
  • మూడు దశల్లో 85.30 % పోలింగ్!
  • గురువారంతో ముగిసిన కోడ్​ 
  • విధుల్లో చనిపోయిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా
  • మూడు విడతల్లోనూ ఎన్నికలు క్లీన్ షీట్‌‌‌‌తో పూర్తి 
  • పంచాయతీ ఎన్నికల ‘రిపోర్ట్’ రిలీజ్ చేసిన స్టేట్​ ఎలక్షన్​ కమిషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం విజయవంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో పల్లెలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. మూడు విడతల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. మూడు విడతల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 1.35 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యాన్ని చాటుకున్నారని.. ఎక్కడ కూడా చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రీ-పోలింగ్ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్లు ప్రకటించింది.

 ఎన్నికల విధుల్లో మరణించిన ములుగు జిల్లా వెంకటాపురం ఎంపీడీవో కె.రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్రావత్ మృతి పట్ల ఎన్నికల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో సహకరించిన ప్రభుత్వం, సీఎం, డీజీపీ, జిల్లాల యంత్రాంగానికి ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బీఎన్​ఎస్​ఎస్​ సెక్షన్ 163 అమలు, లిక్కర్ మానిటరింగ్​తో ఎన్నికలను ప్రశాంతంగా ముగించినట్టు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 1,205 సర్పంచ్​స్థానాలు ఏకగ్రీవం కాగా.. 11,497 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 25,848 వార్డులు ఏకగ్రీవం కాగా.. 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 22న కొత్తపాలకవర్గలు కొలువుదీరనున్నాయి. ప్రమాణ స్వీకారంతోపాటు అదేరోజు తొలి సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఒక్కచోటా పోలింగ్ ఆగలే.. 

రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లోనూ రీ-పోలింగ్స్, వాయిదాలు లేవని.. జీరో  కౌంటర్ మ్యాండ్స్ నమోదయ్యాయని.. ఒక్కటంటే ఒక్కచోట కూడా పోలింగ్ ఆగలేదని ఎన్నికల సంఘం సెక్రటరీ మకరందు ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో ఎస్​ఈసీ కఠిన నిబంధనలు అమలు చేయడం, పకడ్బందీ ఏర్పాట్లు, భద్రతా చర్యలతో  రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రీ-పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. అలాగే, వాయిదాలు, రద్దు వంటి సంఘటనలు సున్నాగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ (ఎంసీసీ) ఎత్తివేసినట్టు చెప్పారు. 

పల్లెల్లో ఓటు చైతన్యం.. 

ఈ ఎన్నికల్లో యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని పల్లె పాలనలో తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్‌‌‌‌ నమోదైంది. ఈ  జిల్లాలో అత్యధికంగా 92.33 శాతం ఓటింగ్ నమోదైంది. మూడు విడతల్లోనూ అదేజోరు కొనసాగింది. 90.08 శాతంతో  ఖమ్మం రెండో స్థానంలో, 89.68 శాతంతో సూర్యాపేట మూడో స్థానంలో, 89.57 శాతంతో నల్గొండ నాల్గో స్థానంలో, 89.37 శాతంతో మెదక్ ఐదో స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని టాప్-5 జిల్లాలన్నీ దాదాపు 90 శాతానికి అటుఇటుగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఓటింగ్ శాతంలో యాదాద్రి టాప్ లో ఉన్నా..  పోలైన మొత్తం ఓట్ల సంఖ్యలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ జిల్లాలో 9,02,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. నల్గొండ ఓటర్లు భారీ సంఖ్యలో తరలొచ్చి ఓటేశారు. ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం చురుకైన పాత్ర పోషించింది. రాష్ట్రంలోనే ఎన్నికల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ రికార్డు సృష్టించింది. మొదటి విడతలో వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు వేగంగా పూర్తి చేశాయి. రెండో విడత మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ముందంజలో ఉన్నాయి. మూడో విడతలో నల్గొండ జిల్లా ప్రక్రియను త్వరగా ముగించింది. మొత్తానికి  పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త రాజకీయ చైతన్యానికి నాంది పలికాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.