- 433 పోస్టులకు 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన మెడికల్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి, వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఆహ్వానించింది. హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది.
ఒకవేళ ఈ రెండు రోజుల్లో హాజరుకాలేని వారు, ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ లిస్టును ప్రకటించి, అర్హులైన డాక్టర్లకు పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేని వారిని, వెరిఫికేషన్కు హాజరుకాని వారిని ఎంపికకు పరిగ ణనలోకి తీసుకోబోమని బోర్డు పేర్కొంది.
