నాణేలతో చేసిన లంబాడా
ఆభరణాలపై విజిటర్ల ఆసక్తి
న్యూఢిల్లీ, వెలుగు: పైసలతో చేసిన నగలు.. నోరూరించే బిర్యానీ.. స్పెషల్ ఎర్ర చీమల చట్నీ.. ఔరా అనిపించే చేతి కళలు.. ట్రైబల్ డ్యాన్సులు.. ఒక్కటేమిటి ఆదిమహోత్సవ్కు పోతే ఇలాంటివి ఎన్నెన్నో చూడొచ్చు. అయితే, వాటన్నింటినీ కళ్లారా చూడాలంటే మాత్రం ఢిల్లీకి వెళ్లాల్సిందే. ఈనెల 1న ఢిల్లీ హాట్లో ‘వోకల్ ఫర్ లోకల్’ అనే నినాదంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘ఆదిమహోత్సవ్’ను ప్రారంభించారు. గిరిజనుల కళలు, వారి ప్రత్యేకతలను దేశానికి తెలియజెప్పే ఉద్దేశంతో కేంద్ర గిరిజన శాఖ ఏటా ‘ఆది మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. వారి వ్యాపారానికీ ఈ కార్యక్రమం వేదికలా నిలుస్తోంది. అక్కడ తెలంగాణ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రోజూ లక్ష మందికిపైగా అక్కడకు వెళుతున్నారు. తమకు నచ్చిన గిరిజన బొమ్మలు, ఆభరణాలను కొనుక్కుంటున్నారు. చత్తీస్గఢ్, ఒడిశా, మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్కు చెందిన ట్రైబల్ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ లంబాడ నగిషీలకు మంచి గిరాకీ
ఆదిమహోత్సవ్లో ఇండియా నుంచి 500కుపైగా గిరిజన కళాకారులు, వ్యాపారులు పాల్గొంటున్నారు. దాదాపు 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన లంబాడ నగిషీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఐదు పైసలు, పావలా, ఆఠాణా, రూపాయి బిళ్లలతో చేసిన లంబాడాల నగలపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. హస్ లీ, టోబ్లీ, గూగ్రీ, వాంక్ డీ, కాస్ని, ఈ చూవా, గాజుర్ బంద్, కసోటియా, బలియా, హేతియా వంటి ప్రత్యేక ఆభరణాలు తెలంగాణ స్టాల్లో ఆకర్షణగా నిలిచాయి. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మండన్ అరుణ ఈ స్టాల్స్ను నిర్వహిస్తున్నారు. సిల్వర్, జెర్మన్తో తయారయ్యే తెలంగాణ లంబాడ డిజైన్లకు నార్త్ ఇండియాలో గిరాకీ ఉంటుందన్నారు. కరోనా ప్రభావం ఉన్నా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయని అరుణ చెప్పారు.
బంజారా స్టైల్ బిర్యానీ
బిర్యానీ అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ, ఆదిమహోత్సవ్లో బంజారా స్టైల్ దమ్ బిర్యానీ నోరూరిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన అశోక్ బంజారా బిర్యానీ స్టాల్ ఏర్పాటు చేశారు. బంజారా స్టైల్లో చేసిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ అమ్ముతున్నారు. 2019 ఆదిమహోత్సవ్లో బంజారా బిర్యానీకి ఫస్ట్ప్రైజ్ వచ్చింది. చత్తీస్గఢ్ గిరిజనులు తినే ఎర్రచీమల చట్నీ స్పెషల్గా నిలుస్తోంది.