హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ (డిప్లొమా, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 14,890 సీట్లు అందుబాటులో ఉండగా.. 8,829 (59 శాతం) మందికి సీట్లు కేటాయించినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.
మొత్తం 13,610 ఇంజినీరింగ్ సీట్లకుగానూ 8,799 (65%) సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపలేదు. మొత్తం1,280 ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 30 (2%) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 460 మందికి సీట్లు కేటాయించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా సీట్లను తుది విడతలో కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించి, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
