
హైదరాబాద్, వెలుగు: గుడి మల్కాపూర్ నానల్నగర్లోని 5,262 చదరపు గజాల జాగా ఎన్వోసీపై దాఖలైన పిటిషన్ను వచ్చే నెల 3న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఆ స్థలానికి ఆధారాలు చూపకుండా ఎన్వోసీ ఇచ్చారని పేర్కొంటూ శాంతి అగర్వాల్ మధ్యంతర పిటిషన్ వేశారు. దాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. శాంతి అగర్వాల్ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్వ్వోసీ కమిటీ చైర్మన్, అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ దుర్గాదాస్, తహశీల్దార్లు వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి గతంలో ఆదేశాలిచ్చారని తెలిపారు.
ఎన్వ్వోసీ పొందిన ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు వివరించారు. అయితే, ఈ కేసులో విచారణ మొక్కుబడిగా సాగుతోందని తెలిపారు. నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందున ఆయనకు వ్యతిరేకంగా కిందిస్థాయి అధికారులు సాక్ష్యం ఇచ్చేందుకు ఆస్కారం లేదన్నారు. ఆ పదవిలో నవీన్ మిట్టల్ కొనసాగడం సరికాదన్నారు. అందుకే దర్యాప్తును సిట్ లేదా సీబీఐకి ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.