వికారాబాద్, వెలుగు: వాగులో కొట్టుకుపోయిన కారులో ఉన్న దంపతులు చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. వికారాబాద్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దారూరు మండలం దోర్నాలకు చెందిన దేవనూరు శివకుమార్ కుటుంబంతో కలిసి వికారాబాద్ లో ఉంటున్నాడు. భార్య మౌనికతో కలిసి దసరా పండుగకు సొంతూరు వచ్చారు. గురువారం ఉదయం కారులో దంపతులిద్దరూ వికారాబాద్కు బయల్దేరారు. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి నాగారం శివారులోని వాగు కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోంది.
వరద తీవ్రతను గమనించని శివకుమార్ కారును వాగు దాటించే ప్రయత్నం చేశాడు. వాగు మధ్యకు రాగానే నీటి ప్రవాహానికి కారు కొంతదూరం కొట్టుకుపోయి చెట్టుకు తట్టుకుంది. కారులో ఉన్న దంపతులిద్దరూ డోర్లు తీసుకుని కారు పైనుంచి చెట్టు ఎక్కి కుటుంబీకులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబీకులు స్థానికులతో కలిసి తాడు సాయంతో వాళ్లను బయటకు లాగారు. వరద ఉద్ధృతి తగ్గాక జేసీబీతో కారును బయటకు తీశారు.