బావిలో చిరుత.. హరప్పా టెక్నాలజీతో రెస్క్యూ

బావిలో చిరుత.. హరప్పా టెక్నాలజీతో రెస్క్యూ

బావిలో పడిన చిరుతపులిని  హరప్పా మొహంజోదారో కాలం నాటి పురాతన సాంకేతికతను ఉపయోగించి అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి సుశాంత నంద దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అటవీ శాఖ సిబ్బంది మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించుతారు. చిరుత ఆ మంచంపైకి చేరగానే తాళ్ల సహాయంతో పైకి లాగుతారు. దీంతో మంచంపై ఉన్న ఆ చిరుత బావి గట్టుపైకి దూకి అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లిపోతుంది. ‘జంతువుల ఆవాసాల చుట్టూ ఉన్న బహిరంగ బావులను మూసివేసినప్పుడే ఇలాంటివి ఆగిపోతాయి’ అని ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద ట్వీట్ లో వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు ఎలా జరిగిందనే వివరాలు వెల్లడించలేదు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పటికే సుమారు 50 వేల మందికి పైగా దీనిని చూశారు. ఓపెన్‌ బావులపై జల్లెడ మాదిరి మూతలు అమర్చితే జంతువులతోపాటు మనుషులకు కూడా ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయని కొందరు నెటిజన్లు సూచించారు. దీనిని మిషన్‌ మోడ్‌లో చేపట్టాలన్నారు. అటవీశాఖ దీనికి చొరవ చూపాలని, పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి ఓపెన్‌ బావులకు పైమూతలు అమర్చడంపై దృష్టి సారించాలని కోరారు. చిరుతపులిని రక్షించినందుకు అటవీ శాఖ అధికారులను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.