
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17 నుంచి జరగనున్న లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండడంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు, 2,500 మంది పోలీసులు, 280 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశాలు ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా భక్తుల భద్రత కోసం షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు బందోబస్తులో ఉంటారు. బోనంతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోకి తెచ్చారు.మహంకాళి పీఎస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్తో కెమెరాలను కనెక్ట్ చేశారు. పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మహిళలను అప్రమత్తం చేసేందుకు పాత నేరస్తుల ఫొటోలతో కూడిన పోస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. టెంపుల్కి వచ్చే భక్తుల వాహనాల కోసం స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. ఆలయానికి 2 కి.మీ దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆదివారం ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే..
కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే వెహికల్స్ ను రాణిగంజ్ క్రాస్ రోడ్స్, మిని
స్టర్ రోడ్స్, రసూల్ పురా క్రాస్ రోడ్స్, పీఎన్ టీ ఫ్లై ఓవర్, హెచ్ పీఎస్ యూటర్న్, సీటీవో, ఎస్ బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా దారి మళ్లించనున్నారు.
రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెహికల్స్ చిలకలగూడ క్రాస్రోడ్స్, గాంధీ హాస్పిటల్స్, ముషీరాబాద్ క్రాస్రోడ్స్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా ట్యాంక్బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
బైబిల్ హౌస్ నుంచి రైల్వేస్టేషన్, తిరుమలగిరి వైపు వచ్చే వెహికల్స్ను ఘస్మండి క్రాస్ రోడ్స్ మీదుగా సజ్జన్లాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్, రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు.
ఎస్బీఐ క్రాస్ రోడ్స్ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ను ప్యారడైజ్, మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్స్, చిలకలగూడ, ముషీరాబాద్ క్రాస్రోడ్స్, కవాడిగూడ, ట్యాంక్బండ్ రూట్లో దారి మళ్లించనున్నారు.
సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సింధి కాలనీ, మినిస్టర్ రోడ్స్, రాణిగంజ్ క్రాస్ రోడ్స్, కర్బాల మైదాన్ రూట్లో వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ ప్రాంతాలు..
టెంపుల్కు వచ్చే భక్తుల వెహికల్స్ పార్కింగ్: సెయింట్ జాన్స్, రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ హరిహర కళా భవన్, మహబూబియా,ఎస్వీఐటీ కాలేజీ వద్ద పార్క్ చేయాలి.
సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వెహికల్స్: ఓల్డ్ జైల్ ఖాన్ ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్
కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, వైపు నుంచి వచ్చే వెహికల్స్: ఇస్లామియా హై స్కూల్ గ్రౌండ్ లో పార్కింగ్
రాణిగంజ్, అడయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్: అడయ్య మెమోరియల్ హై స్కూల్ గ్రౌండ్
రసూల్పురా, సీటీవో, బాలంరాయి నుంచి వెహికల్స్: మహాత్మ గాంధీ రోడ్, గాంధీ విగ్రహంమంజు థియేటర్స్ నుంచి వచ్చే వెహికల్స్: అంజలి థియేటర్ లేన్ లో పార్కింగ్