అంగట్లో కరోనా టెస్టింగ్ కిట్..రూ.500 కిట్టు బ్లాక్ లో రూ.1500

అంగట్లో కరోనా టెస్టింగ్ కిట్..రూ.500 కిట్టు బ్లాక్ లో రూ.1500

హైదరాబాద్‌, వెలుగు: కరోనా టెస్టింగ్ కిట్లకు, టెస్టులకు మార్కెట్‌లో ఇప్పుడు మస్త్ డిమాండ్‌ ఉన్నది. ఈ డిమాండ్‌ను కొంతమంది హెల్త్ స్టాప్, ల్యాబ్ల యజమానులు, ప్రైవేట్‌ వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రూ. 500 విలువ చేసే టెస్టింగ్ కిట్లను కొని, బ్లాక్‌లో రూ.1500కు అమ్మేస్తున్నారు. తమ అప్రూవల్ ఉన్న ల్యాబ్లకు, హాస్పిటళ్లకు మాత్రమే ఈ కిట్లను అమ్మాలని ప్రైవేట్ కంపెనీలను ఐసీఎంఆర్ ఆదేశించింది. దీంతో ఐసీఎంఆర్ అప్రూవల్ ఉన్న కొన్నిల్యాబ్లు, హాస్పిటల్స్  పెద్ద సంఖ్యలో యాంటీజెన్‌ కిట్లను కొని, మార్కె ట్‌లో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు చిన్న చిన్న క్లినిక్ లకు  కూడా అమ్ముతున్నారు. కొంతమంది డాక్టర్లు మళ్లీ వాటిని రీసేల్ చేస్తుండగా, మరి కొంతమంది తమ క్లినిక్ లలోనే దొంగచాటుగా టెస్టులు చేస్తున్నారు. టెస్టుల కోసం ప్రభుత్వ దవాఖాన్లలో గంటల కొద్దీ లైన్లలో నిలబడాల్సి  వస్తుండడం, లక్షణాలు ఉన్నా రేపురా, ఎల్లుండిరా అంటూ తిప్పుకుంటుండడంతో జనం కూడా ఈ కిట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కిట్లుకొని పెట్టుకుని లక్షణాలు  వచ్చినప్పుడు సొంతగానే టెస్ట్ చేసుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్, ఖమ్మం సహా పలు చోట్ల ఈ దందా నడుస్తున్నది. ఇటీవల మల్కాజ్‌గిరి లో అనుమతి లేకుండా యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్న ఓ క్లినిక్లిక్‌పై హెల్త్ ఆఫీసర్లకు, ఆరోగ్యశాఖకు ఫిర్యాదు కూడా చేశారు.

ఐసీఎంఆర్ ఏం చెప్పింది?

నేషనల్ బోర్డు అక్రిడేషన్ ఉన్న ల్యాబ్లు, హాస్పి టళ్లలో యాంటిజెన్‌ టెస్టులు చేయడానికి ఐసీ ఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. ఇందుకోసం సదరు సంస్థలు ఐసీఎంఆర్‌కు రిక్వెస్ట్పెట్టుకోవాలి. రిక్వెస్ట్పెట్టిన హాస్పిటల్ లేదా ల్యాబ్ కు ఐసీఎంఆర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తుంది. వీటితో ఐసీఎంఆర్‌ పోర్టల్ ‌లో లాగిన్ అయి టెస్టులు, వాటిలో పాజిటివ్‌ వ్యక్తుల వివరాలు, నెగెటివ్ వ్యక్తుల వివరాలన్నింటినీ అప్‌లోడ్ చేయాలి. అలాగే, స్టేట్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పర్మి షన్ తీసుకుని స్టేట్‌ పోర్టల్ ‌లో అప్‌లోడ్ చేయాలి. చాలా ల్యాబ్లు, హాస్పిటళ్లలో ఈ పర్మిషన్లు లేకుండానే దొంగచాటు టెస్టులు చేస్తున్నారు. హెల్త్డిపార్ట్ మెంట్ ఆఫీసర్లూ చూసీ చూడనట్టుగానే వదిలేస్తున్నారు.

యాంటీబాడీ టెస్టులు

కరోనా సోకిందా, లేదా తేల్చేందుకు ఆర్టీపీర్టీసీఆర్‌, ర్యాపిడ్ యాంటీజెన్‌ టెస్టులను మాత్రమే చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. యాంటీబాడీ టెస్టులను డయాగ్నసిస్ కోసం వాడొద్దని, కేవలం వైరస్ వ్యాప్తిని తెలుసుకునే సర్వేల కోసమే వాడాలని చెప్పింది. కానీ, రాష్ట్రంలో యాంటీబాడీ టెస్టులు కూడా యథేచ్ఛగా చేసేస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ డయాగ్నసిస్‌ సెంటర్లు ఇంటికొచ్చి మరీ ఈ టెస్టులు చేస్తున్నాయి. ఇందుకోసం రూ. వెయ్యి నుంచి 2 వేల దాకా వసూలు చేస్తున్నా యి. వాస్తవానికి యాంటీబాడీ టెస్ట్కిట్ల ఖరీదు రూ. 400 లోపు మాత్రమే ఉంది. ప్రభుత్వం సరిపడా టెస్టులు చేయకపోవ డంతో జనం ఇలా బ్లాక్ మార్కెట్‌లో కిట్లు కొనడం, దొంగచాటుగా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.