‘బేటీ బచావో’ నిధులు ప్రభుత్వం ఖర్చు చేయట్లే

‘బేటీ బచావో’ నిధులు ప్రభుత్వం ఖర్చు చేయట్లే
  • కేంద్రం ఐదేళ్లలో ఇచ్చిందిరూ. 6.17 కోట్లు.. రాష్ట్రం ‌ఖర్చు చేసింది రూ. 3.81 కోట్లే
  • రాష్ట్రంలో తొలగని లింగ వివక్ష
  • ఫండ్స్ ఉన్నా.. అవేర్ నెస్ ప్రోగ్రాంలు చేపట్టని అధికారులు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పఢావో స్కీమ్‌ కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర సర్కార్ పూర్తి స్థాయిలో వాడుకోవట్లేదు. 2015–16 నుంచి గతేడాది వరకూ ఈ స్కీమ్ కోసం కేంద్రం రూ. 6.17 కోట్లు కేటాయిస్తే, అందులో రూ.3.81 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఐదేండ్ల నుంచి నిధుల వినియోగం అరకొరగానే ఉంటోంది. స్కీమ్ కోసం కేటాయించిన నిధులు, ఇతర వివరాలను కేంద్ర సర్కార్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రతి1000 మంది మగపిల్లలకు, 950 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆడ పిల్లలపై వివక్షను తొలగించి, సెక్స్‌ రేషియో మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. వివక్షను రూపుమాపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, భ్రూణ హత్యలు జరగకుండా అవగాహన కల్పించడం, ఆడపిల్లలను చదివించేలా తల్లిదండ్రులను మోటివేట్ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ సెక్స్‌ రేషియో మెరుగయ్యేలా చూడడమే ఈ స్కీమ్ లక్ష్యం. కానీ, మన దగ్గర మాత్రం ప్రచార కార్యక్రమాలను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అవేర్ నెస్ ప్రోగ్రాంలు, క్యాంపెయిన్ నిర్వహించేందుకు నిధులు ఉన్నప్పటికీ వాటిని వాడుకోకపోవడం గమనార్హం.

అండమాన్ బెస్ట్.. ఢిల్లీ లాస్ట్

మన రాష్ర్టంలో పోయినేడాది ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు  950 మంది ఆడపిల్లలున్నట్టు కేంద్రం చెప్పింది.  అత్యధికంగా అండమాన్ నికోబార్‌‌లో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు, 985 మంది ఆడపిల్లలు జన్మిస్తున్నారు. ఢిల్లీలో అత్యల్పంగా 915 మంది ఆడపిల్లలే పుడుతున్నారు