ప్రేమించి పెండ్లి చేసుకున్నారని.. యువకుడి ఇంటికి నిప్పు

 ప్రేమించి పెండ్లి చేసుకున్నారని.. యువకుడి ఇంటికి నిప్పు
  •      అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి 

శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో  ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇంటి మీద  శుక్రవారం  అమ్మాయి బంధువులు  దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు.  గ్రామానికి చెందిన సోమ ప్రశాంత్, అతని  ఇంటి వెనకాల ఉండే పిట్ల జ్యోతి కొన్నాళ్లుగా  ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం జ్యోతి ఇంట్లో తెలిసి  కొద్ది రోజుల కిందట  ప్రశాంత్ కుటుంబసభ్యులను పిలిపించి పంచాయతీ పెట్టారు.  అమ్మాయి జోలికి రావొద్దని ప్రశాంత్​ను మందలించారు. గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్, జ్యోతి శుక్రవారం తాము పెళ్లి చేసుకున్నట్టు వాట్సప్​లో ఫొటో పెట్టారు.

ఇది చూసిన జ్యోతి కుటుంబసభ్యులు ఆవేశంతో  ప్రశాంత్ అమ్మమ్మ ఊరైన లచ్చిరెడ్డిగూడానికి వెళ్లి  ప్రశాంత్​ తల్లి నాగమణి, చెల్లి నవనీత, బావ నరేశ్ పై దాడి చేశారు. పక్కన ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేయగా  వారిపైనా దాడి చేశారు. అక్కడినుంచి  దొంతి గ్రామానికి వచ్చి ప్రశాంత్ ఇంటి తలుపులను  గొడ్డలితో బద్దలుకొట్టి  ఇంట్లో డీజిల్ పోసి నిప్పు పెట్టారు. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయింది.  మంటలకు ఇంట్లో ఉన్న సిలిండర్ పేలిపోయింది.   అప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

చుట్టుపక్కలవారు  నిప్పు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని  బెదిరించారు.  ఇంట్లో ఉన్న నాలుగు తులాల బంగారం, డ్వాక్రా గ్రూపులో తెచ్చిన రూ. 4  లక్షల నగదు,  సామాన్లు మొత్తం కాలిపోయాయని  ప్రశాంత్​ తల్లి నాగమణి వాపోయింది. తూప్రాన్ సీఐ కృష్ణ, శివ్వంపేట ఎస్సై రవికాంతరావు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు.