భక్తురాలిపై చేయి చేసుకున్న పూజారి

భక్తురాలిపై చేయి చేసుకున్న పూజారి

దేవుని దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలి మీద చేయి చేసుకున్నాడు ఆలయ పూజారి. పూజ చేయించుకొనె నెపంతో తన మెడలోని బంగారు గొలుసు లాక్కొనే ప్రయత్నం చేసిందంటూ ఆమెపై నింద వేశాడు. వివరాల్లోకి వెళ్తే..  తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయంలో లత అనే మహిళ తన కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా ఆలయానికి వెళ్లింది.  తన కొడుకు పేర అర్చన చేయమని పూజాసామగ్రిని పూజారి దర్శన్ చేతికి ఇచ్చింది. పూజ చేసిన పూజారి.. కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి ఇచ్చేశాడు. దీంతో పూజారిని లత ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పూజారి ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు.

జరిగిన విషయాన్ని గమనించిన అక్కడున్న మరి కొద్దిమంది భక్తులు ఈ విషయంపై ప్రశ్నించగా.. తన మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కునేందుకు లత ప్రయత్నించిందని, ఆ క్రమంలో ఆమెను అడ్డుకోబోతుంటే తన చేయి ఆమె చెంపకు తగిలిందని పూజారి చెప్పాడు. ఈ విషయాన్ని పోలీసులు దగ్గరికి తీసుకెళ్లడంతో.. వారు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పూజారి పరారీలో ఉన్నాడు.