
అబుదాబి/ దుబాయ్: వీకెండ్ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఐపీఎల్లో మరో డబుల్ హెడర్ సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం జరిగే ఫస్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు సవాల్ విసరనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో ఉండాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు బాట పట్టాలి. సన్రైజర్స్తో లాస్ట్ మ్యాచ్లో 69 రన్స్ తేడాతో ఓడి మరింత డీలా పడిన పంజాబ్ విజయం సాధించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా యంగ్స్టర్స్, సీనియర్స్తో నిండిన కేకేఆర్పై గెలవాలంటే పంజాబ్ ప్లేయర్లు ప్రాణం పెట్టి ఆడాల్సిందే. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న కేకేఆర్ లీగ్లో బలమైన పోటీదారుగా మారుతోంది. మరోవైపు పంజాబ్ బ్యాటింగ్ అంతా కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్పై ఆధారపడి ఉంది. వీరికి తోడు నికోలస్ పూరన్ చెలరేగుతున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతున్న క్రిస్ గేల్ కోలుకుంటే అతను ఈ మ్యాచ్లో బరిలో దిగే చాన్సుంది. బ్యాటింగ్ లైనప్ బాగానే ఉన్నా బౌలింగ్ పంజాబ్లో తడబడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అంతా ఫెయిలవుతున్నారు. పంజాబ్ గెలవాలంటే ఈ ప్రాబ్లమ్ ను అధిగమించి తీరాలి.
విరాట్ x ధోనీ
సాయంత్రం జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో పోటీపడనుంది.ఫేవరెట్గా టోర్నీ బరిలోకి దిగి విజయాల కోసం అవస్థలు పడుతున్న సీఎస్కేకు ఫామ్ పరంగా తమ కంటే చాలా మెరుగ్గా కనిపిస్తున్న ఆర్సీబీ నుంచి గట్టిపోటీ తప్పదు. కోల్కతాతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో విజయం ముంగిట దాకా వచ్చి ఓడిన చెన్నై టీమ్ బ్యాటింగ్ లైనప్కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తోంది. లాస్ట్ పెర్ఫామెన్స్ తర్వాత ఆల్రౌండర్ కేదార్ జాదవ్పై వేటు పడడం ఖాయమే.