
ఐపీఎల్ 2025 ముగిసింది. రెండు నెలలకు పైగా ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తున్న ఈ మెగా ఈవెంట్ మంగళవారం ఫైనల్ తో (జూన్ 3)తో ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో గ్రాండ్ గా ఈ సీజన్ కు ఎండ్ కార్డు పడింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి తొలి సారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్ కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ కు మరోసారి నిరాశే తప్పింది. ఈ సీజన్ లో విన్నర్, రన్నరప్ తో పాటు మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల ప్రైజ్ మనీ వివరాలు వెల్లడించారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ విన్నర్ బెంగళూరుకు రూ. 20 కోట్లు:
ఈ సీజన్ లో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. గత సీజన్ తో పోలిస్తే ప్రైజ్ మనీ విషయంలో ఎలాంటి వార్త లేదు. 2024 లో ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్ రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ ఎడిషన్తో పోల్చితే, ఐపీఎల్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. అప్పుడు విజేతలకు రూ. 4.8 కోట్లు ఇవ్వగా.. 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగింది.
రన్నరప్ పంజాబ్ కింగ్స్ కు రూ.13 కోట్లు:
ఈ సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ కు రూ. 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్ లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలిచింది. క్వాలిఫయర్ 1 లో బెంగళూరుపై ఓడిపోయినా.. క్వాలిఫయర్ 2 లో ముంబైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్లో తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 184 పరుగులకే పరిమితమైంది.
మూడు, నాలుగో స్థానంలో నిలిచిన జట్లకు వరుసగా రూ. 7 కోట్లు.. రూ. 6.5 కోట్లు ప్రైజ్ మనీ అందుతాయి. క్వాలిఫయర్ 2 లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో నిలిచింది. హార్దిక్ సేనకు రూ. 7 కోట్ల రూపాయాలు అందుతాయి. ఇక ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ కు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. ప్లే ఆఫ్స్ కు చేరని జట్లకు ఎన్ని కోట్లు అందాయో ఎలాంటి వివరాలు లేవు.