ఆ రెండు పార్టీలవి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా

ఆ రెండు పార్టీలవి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా

తెలంగాణ సమాజానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఈ తీర్థయాత్రలతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదంటూ విమర్శించారు రేవంత్. కల్లంలో ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలేమిటని ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ తన వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి పోయిందన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఒత్తిడితోనే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారన్నారు. యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడిచేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిటి ఉరితాడైందని ఆరోపించారు. 

కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే తాను మాట్లాడుతున్నానన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు రేవంత్. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయాలననారు. ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేయాలని తన లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
చనిపోయిన రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు.  తక్షణం వారికి పరిహారం ఇవ్వాలని బహిరంగ లేఖలో రేవంత్ డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలన్నారు. రైతాంగ సమస్యలపై నేడు, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తామన్నారు. భవిష్యత్ లో కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. తెలంగాణ సమాజం కూడా రైతులకు అండగా నిలవాలని రేవంత్ పిలుపు నిచ్చారు.