భారీ వర్షాల కారణంగా భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది. వరద నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే అపార్ట్మెంట్ లలోకి నీరు రావడంతో తామే నగరంలో విద్యుత్ ని నిలిపి వేశామని చెప్పారు ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభాకర్ రావు .హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సమస్య నెలకొనడంతో ప్రభాకర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా చోట్ల సబ్ స్టేషన్ లలో నీరు చేరిందని, నీరు తొలిగిపోగానే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. మూసి నది ప్రవాహంలో 200 ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయన్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేశామని చెప్పారు.ఎక్కడైనా స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని ప్రభాకర్ రావు సూచించారు
ఎన్టీపీసీ వారి సహకారంతో గ్రిడ్ కు ఇబ్బంది లేకుండా చేశామని, కరెంట్ డిమాండ్ ఎంత తగ్గినా.. ఎంత పెరిగినా గ్రిడ్ కి ఎలాంటి డోకా లేదని అన్నారు. హైడల్ విద్యుత్ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. కానీ, 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అన్నారు. శ్రీశైలం విద్యుత్ సంబంధించి త్వరలోనే నివేదిక వస్తుందని, దురదృష్టవశాత్తు అందులో అధికారులకు కరోనా సోకడంతో కొంత ఆలస్యం అయిందని అన్నారు.