హర్నాజ్ సంధూ డ్రెస్ డిజైన్ చేసిన ట్రాన్స్ ఉమెన్

హర్నాజ్ సంధూ డ్రెస్ డిజైన్ చేసిన ట్రాన్స్ ఉమెన్

విశ్వ వేదికపై భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. 21 ఏళ్ల తర్వాత మరోసారి మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు దక్కింది. చండీగఢ్ కు చెందిన హర్నాజ్ సంధూ విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ గ్రాండ్ ఫినాలేలో ధరించిన సిల్వర్ కలర్ గౌను ఇప్పుడు అందరి దృష్టి ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ గౌన్ డిజైనర్ ఎవరు? ఆమె కథ ఏంటి?
మిస్ యూనివర్స్ ఫైనల్ లో హర్నాజ్ సంధూ ధరించిన గౌనును సాయేషా షిండే డిజైన్ చేశారు. ఆమె ఓ ట్రాన్స్ జెండర్. తాను రూపొందించిన డ్రెస్ ను ధరించిన యువతి విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలవడంపై సాయేషా సంతోషం పట్టలేకపోతోంది. 40ఏళ్ల సాయేషా మిస్ యూనివర్స్ హర్నాజ్ కోసం డిజైన్ చేసిన డ్రెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సిల్వర్ కలర్ గౌన్ పై ఎంబ్రాయిడరీ, స్టోన్ వర్క్, సీక్వెన్స్ లతో అందంగా తీర్చి దిద్దారు. హర్నాజ్ సంధూ పంజాబీ మూలాలున్న అమ్మాయి కావడంతో ఫూల్ కారీ ప్యాటర్న్ ను కూడా ఉపయోగించారు. 
సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన సాయేషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. అబ్బాయిగా పుట్టినా చిన్నప్పటి నుంచి తనకు అమ్మాయిల డ్రెస్ లు వేసుకోవడం, అందంగా ముస్తాబవడం అంటే ఇష్టం. నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్న సమయంలో తానేంటో తనకు అర్థమయింది. అప్పటికి తన వయసు 20 ఏళ్లు. కానీ తన సెక్సువాలిటీ గురించి బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఆరేళ్ల క్రితం ఓ రోజున ఇక తాను ఈ ముసుగు తొలిగించాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకుంది. ట్రాన్స్ ఉమెన్ గా మారాలని నిర్ణయించుకుంది.  అలా ఆరేళ్ల పాటు తీసుకున్న ట్రీట్ మెంట్ సర్జరీ అనంతరం ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా తన జెండర్ రివీల్ చేసింది. తానో ట్రాన్స్ ఉమెన్ నని గర్వంగా ప్రకటించుకుంది. 
సాయేషా ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకొణె, తాప్సీ పొన్ను, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, మాధురి దీక్షిత్ కు డిజైనర్ గా వ్యవహరిస్తోంది. మణి రత్నం డైరెక్షన్ లో తెరకెక్కతున్న సినిమాలో ఐశ్వర్యా రాయ్, త్రిషతో పాటు కృతి సనన్ నెక్ట్స్ మూవీలో ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది.