మంత్రి, కార్పొరేటర్ ముందే కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు

మంత్రి, కార్పొరేటర్ ముందే కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు
  • మంత్రి సబిత సమక్షంలోనే బీజేపీ,టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య లొల్లి

ఎల్బీ నగర్, వెలుగు: వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి సమక్షంలోనే టిఆర్ఎస్, బిజెపి నాయకులు కొట్లాడుకున్నారు. ఆర్.కె.పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకున్న అప్పటికి కూడా ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. కాలనీ సమస్య విషయమై స్థానికులు మంత్రితో మాట్లాడుతుండగా ఇరు పార్టీల నాయకులు గొడవకు దిగారు. టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడి వల్లే ఈ గొడవ జరిగిందని చర్చ. కాగా ప్రభుత్వం వరద బాధితులకు ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని సమాచారం ఇవ్వడం లేదని కార్పొరేటర్ అసహనం వ్యక్తం చేస్తూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తాను స్థానిక కార్పొరేటర్ గా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం చేసే విషయంలో పెత్తనం చేస్తున్నారని కార్పొరేటర్ మండిపడ్డారు. అధికారులు కూడా టిఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సహాయానికి టిఆర్ఎస్ రంగు కోరడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు. డివిజన్ లో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం తో పాటు అనవసరంగా టిఆర్ఎస్ నాయకులు గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు.అధికారిక కార్యక్రమాల్లో టిఆర్ఎస్ నాయకులు పెత్తనం అం చేస్తుంటే అధికారులు కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సహాయంగా ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.