ఏర్పాట్లు చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్
నేడో, రేపో టీఎస్పీఎస్సీ నుంచి సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్ట్
హైదరాబాద్, వెలుగు:సర్కారీ ప్రైమరీ స్కూళ్లలోకి త్వరలో కొత్త సార్లు రాబోతున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థుల తుది ఫలితాలు విడుదల కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్టీ -2017లో మొత్తం 3,786 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ లిస్టును వారం క్రితం విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గతంలో రిలింక్విష్మెంట్ కంటే ముందు 3,375 మందితో లిస్ట్ రిలీజ్ చేయగా, తాజాగా దీంట్లోంచి 50 మంది తగ్గారు.
కోర్టు కేసులతో మిగిలిన పోస్టుల ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వలేదని అధికారులు ప్రకటించారు. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన తుది జాబితా ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ చేతికి అందనున్నది. ఆ లిస్టును అధికారులు మరోసారి పరిశీలించి, ఆయా జిల్లాలకు పంపించనున్నారు. ఈ ప్రక్రియకు 4,5 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. గతంలో నిర్వహించిన ఎస్ఏ, ఎస్జీటీ పోస్టుల మాదిరిగానే, ఈ పోస్టులకూ కౌన్సెలింగ్ చేపడతామన్నారు.