![సాగుకు సన్నాహాలు షురూ .. వరి పంట 3,13,955.ఎకరాలు](https://static.v6velugu.com/uploads/2024/05/farmers-will-cultivate-paddy-in-large-area-monsoon-season-as-well-in-kamareddy-district_JXh4uO2oUs.jpg)
- కామారెడ్డి జిల్లా లో వానాకాలం సీజన్లో 5,14,686 ఎకరాల్లో పంటలు సాగుకు అంచనా
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్ లో కూడా రైతులు అధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేయనున్నారు. ఈ సీజన్ ప్రణాళికను అగ్రికల్చర్ ఆఫీసర్లు రూపొందించారు. జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 5,14,686 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా వరి పంటను రైతులు సాగు చేయనున్నట్లు ప్రతిపాదించారు. ఈ సారి వర్షాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. వానాకాలం సీజన్ కు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరో వైపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
జిల్లాలో సాగు ప్లాన్ ఇలా..
జిల్లాలో మొత్తం 5,14,686 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా. ఇందులో వరి 3,13,965 ఎకరాలు, సోయా 85,444.ఎకరాలు, మక్క 57,315 ఎకరాలు, పత్తి 28,730 ఎకరాలు, కంది 13,961 ఎకరాలు, మినుము5,263 ఎకరాలు, పెసర 4,997 ఎకరాలు, జొన్న 577 ఎకరాలు, చెరకు 2,215 ఎకరాలు, ఇతర పంటలు2,172 ఎకరాలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో
పంటల సాగుకు అనుకూలంగా ఎరువులు, విత్తనాలు మార్కెట్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ కు అన్ని రకాల పంటలకు 1,10,282 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా వరి 78,492 క్వింటాళ్లు, సోయా 25,633 క్వింటాళ్ల విత్తనాలు, మక్క 4,585 క్వింటాళ్లు, పత్తి 287 క్వింటాళ్లు, కంది 419, పెసర 400, మినుములు 421 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు తెలిపారు. సాగు ప్లాన్ కు అనుగుణంగా జిల్లాకు విత్తనాలు కేటాయించాలని ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదించారు. ఇప్పటికే పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు సప్లై చేస్తున్నట్లు
పేర్కొన్నారు.