కోలుకోవట్లే.. పీకల్లోతు నష్టాల్లోకి ఆర్టీసీ

కోలుకోవట్లే.. పీకల్లోతు నష్టాల్లోకి ఆర్టీసీ

ఆర్టీసీని వరుస కష్టాలు వీడడం లేదు. కార్మికుల సమ్మె, లాక్‌‌‌‌డౌన్‌, డీజిల్ ధరల పెంపు వంటి సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో నల్గొండ రీజియన్‌కు భారీ నష్టమే వాటిల్లింది. మొదట్లో కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడవలేదు. ఆ తర్వాత కుదురుకుంటుందనగానే కరోనా వ్యాప్తి పెరిగింది. దీంతో లాక్‌‌‌‌డౌన్ ప్రకటించడంతో సుమారు 58 రోజుల పాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. మే 19న లాక్ డౌన్‌ సడలించడంతో బస్సుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజుల్లో ప్రయాణికుల రద్దీ తక్కువగానే ఉన్నా తర్వాత క్రమంగా పెరగడంతో అదే స్థాయిలో ఇన్‌కం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం కరోనా పట్టణాలు, పల్లెలకు పాకడంతో స్వీయ లాక్‌‌‌‌డౌన్‌లు విధించుకుంటున్నారు. దీంతో బస్సెక్కే వారే కనిపించడం లేదు. దీనికి తోడు డీజిల్ ధరలు కూడా పెరిగిపోతుండడంతో నష్టం మరింత పెరిగింది. జూన్‌‌‌‌లో నల్గొండ రీజియన్‌కు గతేడాదితో పోల్చుకుంటే రూ. 16.17 కోట్ల నష్టం వాటిల్లింది.

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మొత్తం 750 బస్సులు ఉండగా, ప్రస్తుతం అంతరాష్ట్ర సర్వీసులకు పర్మిషన్ లేకపోవడం, విద్యా సంస్థలు మూతపడడంతో 300 బస్సులు నడవడం లేదు. ప్రస్తుం 450 బస్సులు మాత్రమే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. లాక్‌డౌన్ ‌‌‌‌రూల్స్ సడలించాక రీజియన్ ఇన్‌‌‌‌కం రూ. 6 లక్షలతో మొదలైంది. తర్వాత ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగి ఇన్‌‌‌‌కం రూ. 45 లక్షలకు చేరుకుంది. ఆషాఢ మాసం ప్రారంభమైన వారం, పది రోజుల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగింది.

వెంటాడుతున్న కరోనా…

కొద్దిరోజుల నుంచి పట్టణాలు, పల్లెల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆర్టీసీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు తగ్గించారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 12కు పడిపోయింది. గత 10 రోజుల నుంచైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ‌‌‌‌విధిస్తారని ప్రచారం జరగడం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. హైదరాబాద్‌లోని బేగంబజార్, గంజ్ వంటి పెద్దపెద్ద మార్కెట్లు బంద్ కావడంతో జిల్లా నుంచి రాకపోకలు తగ్గాయి. జిల్లాకు వచ్చే సరికి పట్టణాలు, పల్లెల్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యాపారులు స్వీయ లాక్‌డౌన్ ‌‌‌‌అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. సాధారణంగా నల్గొండ రీజియన్ నుంచి హైదరాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాచలం, మిర్యాలగూడెం, దేవరకొండ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ ప్రస్తుత‌ పరిస్థితుల్లో బస్సుల్లో ప్రయాణించడాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఒక్కో బస్సులో 10 నుంచి 12 సీట్లుమాత్రమే నిండుతున్నాయి. దీంతో ఇన్‌‌‌‌కం రూ.45 లక్షల నుంచి రూ.30 లక్షలకు పడిపోయింది. ఆర్టీసీ చార్జీలు పెంచక మందు గతేడాది జూన్‌‌‌‌లో రీజియన్‌‌‌‌కు రూ.27.69 కోట్ల ఇన్ కం రాగా, ఈ ఏడాది జూన్‌‌‌‌లో రూ.11.52 కోట్లేవచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి రీజియన్‌‌‌‌కు రూ.16.17 కోట్ల నష్టం వాటిల్లింది.

డీజిల్ ధరలతో మరింత దెబ్బ

డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం 450 బస్సులు ప్రతి రోజు 3.16 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఇందుకుగాను రోజుకు 55 వేల లీటర్ల డీజిల్ వాడుతున్నారు. మే30వ తేదీ వరకు డీజిల్ ధర లీటరుకు రూ.57.91గా ఉన్నప్పుడు రీజియన్ ఖర్చు రోజుకు రూ.32,71,285 వచ్చేది. కానీ ఆ తర్వాత ధర రూ.73.17కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం డీజిల్ ఖ‌ర్చు రూ.41,33,309కు పెరిగింది. అంటే రోజుకు రూ. 8,62,024 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.2.58 కోట్ల భారాన్ని రీజియన్ మోయాల్సి వస్తోంది. ఒక వేళ మొత్తం బస్సులు తిరిగితే ఈ భారం మరింత పెరగనుంది. ప్రయాణికుల రద్దీ ఇదే రకంగా ఉంటే రాబోయే రోజుల్లో మరో 50 సర్వీసులను నిలిపివేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం