హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపడానికీ టీ శాట్ మోటివేషనల్ క్లాసులను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా బుధవారం సివిల్స్లో 938వ ర్యాంక్ సాధించిన ఖమ్మంకు చెందిన రావూరి సాయి అలేఖ్యతో స్పెషల్ లైవ్ షోను నిర్వహించింది. తాను ఐదు సార్లు సివిల్స్ సాధించలేకపోయినా ఎలా మోటివేట్ చేసుకుంటూ విజయం సాధించానో ఆమె లైవ్ షోలో వివరించారు.
కాగా, గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీఎస్సీ అభ్యర్థులకు టీశాట్ నెట్వర్క్ ద్వారా లైవ్లో క్లాసులు నిర్వహిస్తామని టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై తొమ్మిది రోజుల పాటు క్లాసులను నిర్వహిస్తామని చెప్పారు. సబ్జెక్టులపై విద్య చానెల్లో మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు రిపీట్ ప్రోగ్రామ్ ఉంటుందని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాలుంటే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.